హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి(86) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీహరి మంగళవారం ఉదయం ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీహరి భార్య గతేడాది నవంబర్లో మరణించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత వారం శ్రీహరి ఇంట్లోనే పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. దీంతో నిమ్స్లో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కన్నుమూశారు. గుడిపూడి శ్రీహరి మరణం పట్ల పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
గుడిపూడి శ్రీహరి 1968లో ది హిందూ కంట్రిబ్యూటర్గా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈనాడులో, హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలోనూ పని చేశారు. ఇక తెలుగు సినిమా చిత్రాల సమీక్షకు శ్రీహరి ఓ చిరునామాగా నిలిచారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించడంతో పాటు తన తోటి సీనియర్ జర్నలిస్టులతో కలిసి, బషీర్బాగ్లోని జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్మాణానికి సేవలందించారు.