చెన్నై: సీపీఐ సీనియర్ నేత డీ పాండియన్ (89) ఇకలేరు. ఆనారోగ్య కారణాలవల్ల షుగర్ లెవల్స్ పడిపోయి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను గత బుధవారం చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం 10.05 గంటలకు పాండియన్ కన్నుమూశారు. పాండియన్కు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన స్వగ్రామం వెల్లాయ్మలయ్పట్టిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
పాండియన్ 1953లో కరాయ్కూడిలోని అలగప్ప కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే సీపీఐలో చేరారు. ఆ తర్వాత పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తూ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. 1989లో, 1991లో రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.
పాండియన్ 1991లో రాజీవ్గాంధీ హత్య జరిగినప్పుడు ఆ స్టేజీ మీదనే ఉన్నాడు. రాజీవ్ ప్రసంగాన్ని తమిళంలోకి అనువాదం చేస్తూ మరో పోడియం ముందు నిలబడి ఉన్నాడు. రాజీవ్గాంధీ హత్య కోసం జరిగిన బ్లాస్టులో పాండియన్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా కోయంబత్తూర్ అధికారులు పాండియన్ పేరును కూడిన మృతిచెందిన వారి జాబితాలో ప్రకటించారు. ఆ తర్వాత తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడని తెలుసుకుని మృతుల జాబితా నుంచి తొలగించారు.