రామాయంపేట : భారీ వర్షాలకు కూలిపోయిన ప్రహరీలకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా మార్కెటింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గణేశ్, డిప్యూటీ ఇంజినీర్ మాధవరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం వారు రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించి కూలిపోయిన ప్రహరీని పరిశీలించి మాట్లాడారు. రాబోయే సీజన్లో భారీగా ధాన్యం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దళారుల ప్రమేయం లేకుండా పాలక వర్గం చర్యలను తీసుకోవాలన్నారు. మార్కెట్ కమిటీ చుట్టూరా దుకాణ సముదాయం కోసం కూడా చర్యలను తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మార్కెట్ కమిటీలకు సరిపడా గోదాంలు ఉన్నాయన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మార్కెట్లలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో కూలిపోయిన ప్రహరీకి వెంటనే మరమ్మతులు చేయించేందుకు నిధులను మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం రామాయంపేట మార్కెట్ కమిటీ పరిధిలోని చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న గోదాంను కూడా వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, కౌన్సిలర్ దేమె యాదగిరి, మార్కెట్ కమిటీ సిబ్బంది ఉన్నారు.