భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలం పట్టణంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణ సీఐ స్వామి ఆధ్వర్యంలో ప్రొబేషనరీ ఎస్సైలు రాము, రంజిత్కుమార్ తమ సిబ్బందితో బ్రిడ్జి సెంటర్లోని ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఒక బొలేరో వాహనం, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనంపై నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని ఆపి వాహనాలను తనిఖీ చేశారు. వాటిల్లో 300 కేజీల గంజాయి ఉంది. దీని విలువ సుమారు రూ.45 లక్షలు ఉంటుంది. నిందితులను ప్రశ్నించగా తమ పేర్లు దునియా, నాయక్ రాజేశ్, డోంగ్రి రాజేశ్ అలియాస్ టుబే, బిసాయి డోము అలియాస్ సాయి, అలియాస్ సుదర్శన్ అని చెప్పారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని డొంకరాయికి చెందిన వారు. సీలేరులో గంజాయిని కొనుగోలు చేసి సారపాక వైపు రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడ్డారు.