సిరిసిల్ల రూరల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు ప్రాంతంలో 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సిరిసిల్ల పట్టణ ప్రొహిబిషన్ ఎస్ఐ అపూర్వ రెడ్డి పట్టుకున్నారు. ప్రభుత్వం నిరుపేదలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ అపూర్వ రెడ్డి సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. రగుడు వద్ద రెండు వ్యాన్లలో కరీంనగర్ రేకుర్తికి చెందిన తిరుపతి, సిరిగిరి రాజ్, చింతల సంజీవ్, జనార్దన్ అనే వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.
వారిని విచారించగా.. చుట్టు పక్కల గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి.. ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా వాహనాలు, బియ్యాన్ని సీజ్ చేసి, నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అపూర్వ మాట్లాడుతూ పేదలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.