సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : కంటోన్మెంట్ను ప్రత్యేక దేశంగా ఊహించుకుంటున్న బోర్డు, మిలటరీ అధికారులు రోడ్లను మూసివేసి లక్షలాదిమందిని నరకయాతనకు గురిచేస్తున్నారు. వారి ఏకపక్ష నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి మూసి ఉన్న రోడ్లపై కంటోన్మెంట్ బోర్డు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం ప్రజల్ని మరింత అసహనానికి గురి చేస్తున్నది. శాశ్వతంగా వాటిని మూసివేసి.. ప్రధాన నగరానికి నేరుగా అనుసంధానం లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకవైపు అన్నివర్గాలను ఏకం చేయడంతో పాటు మరోవైపు బోర్డు నోటిఫికేషన్లో భాగంగా ఇచ్చిన అవకాశం మేరకు రోడ్ల మూసివేతపై ముక్తకంఠంతో వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు సంతకాల సేకరణను కూడా ముమ్మరం చేశారు.
నగరానికి ఈశాన్య భాగంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో దాదాపు పది శాతం జనాభా నివసిస్తున్నది. మల్కాజిగిరి, కాప్రా, అల్వాల్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు బోర్డు పరిధిలో ఎనిమిది వార్డులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉండే వందలాది రెసిడెన్షియల్ కాలనీల్లో లక్షలాది మంది నిత్యం అనేక అవసరాల నిమిత్తం బోర్డు పరిధిలోని రోడ్ల మీదుగా ప్రయాణం చేస్తుంటారు. కుషాయిగూడ, మౌలాలి, చెర్లపల్లి, నాచారం వంటి పారిశ్రామికవాడలు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్, రవాణా వ్యవస్థలో భాగంగా రాజీవ్గాంధీ రహదారి, విద్య, వ్యాపారం, వినోదం… ఇలా అనేక అవసరాల కోసం గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ 2013 నుంచి ఇప్పటివరకు 20కి పైగా రోడ్లను స్థానిక మిలటరీ అధికారులు మూసివేయడంతో నిత్యం లక్షలాది మంది అవస్థలు పడుతున్నారు.
మంత్రి కేటీఆర్ లేఖ రాసినా స్పందించని కేంద్ర మంత్రి
దీనిపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు అనేకసార్లు వివిధ మార్గాల్లోనూ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. టీఆర్ఎస్ నాయకులు అనేకసార్లు నిరసన కూడా వ్యక్తం చేశారు. అయినా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు ప్రధానంగా కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు కిషన్రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు.
రోడ్లకు అడ్డుగా గోడ కట్టి..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో దాదాపు 20కిపైగా రోడ్లను స్థానిక మిలటరీ అధికారులు మూసివేస్తున్నారు. ఈ క్రమంలో 2018లో కీలకమైన అమ్ముగూడ, బ్యాం, ఆల్బెయిన్, ఎంపైర్, ప్రొటినీ, రిచర్డ్సన్, తదితర ఆరు రోడ్లను తెరవాల్సిందిగా 2018లో కేంద్ర రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా స్థానిక అధికారులు వాటిని పెడ చెవిన పెట్టారు. ఇప్పటికీ ఇందులో అమ్ముగూడ, రిచర్డ్సన్ రోడ్లను గోడ కట్టి మరీ మూసివేశారు. బ్యాం, ప్రొటినీ రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. ఎంపైర్, ఆల్బెయిన్ రోడ్లను గేట్ల ద్వారా మూసివేశారు. అయినా ఇటీవల వీటిని శాశ్వతంగా మూసివేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కాలనీస్ ఆఫ్ సికింద్రాబాద్ సభ్యులు అప్రమత్తమయ్యారు. శాశ్వంతగా రోడ్లను మూసివేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లను తెరిపించాలని సీపీకి వినతి
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా కంటోన్మెంట్ బోర్డు, స్థానిక మిలటరీ అధికారులు వ్యవహరిస్తూ రోడ్లను శాశ్వతంగా మూసివేసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ రెండు అసోసియేషన్ల సభ్యులు ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ను సభ్యులు సీఎస్ చంద్రశేఖర్, పంకజ్ సేథి, ఎంఎల్ అగర్వాల్, ఆనంద్ బాలా, జితేందర్ సురానా, శేషగిరిరావు, మనోజ్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ రోడ్ల మూసివేత ద్వారా లక్షలాది మంది అదనంగా అనేక కిలోమీటర్లు తిరిగి ప్రయాణించాల్సి వస్తుందని, దీంతో పాటు నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల ట్రాఫిక్పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని, రోడ్లను తెరిపించేందుకు పోలీసు శాఖ కృషి చేయాలని కోరారు. దీనిపై సీపీ సీవీ ఆనంద్ సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు తెలిపారు. అదేవిధంగా కేంద్ర మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా కలిసి రోడ్ల మూసివేతకు వ్యతిరేకంగా గళం విప్పుతామని స్పష్టం చేశారు.
సంతకాల సేకరణ
ఆరు ప్రధాన రోడ్ల మూసివేతపై కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రజాభిప్రాయ సేకరణకు 21 రోజుల గడువు ఇచ్చారు. ఈ క్రమంలో మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా రోడ్లను తెరవాలంటూ తమ గళం వినిపించేందుకు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కూడా చేపడుతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కాలనీస్ ఆఫ్ సికింద్రాబాద్ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.