అమరావతి : ఏపీలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఈ నెల 19న స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు.
శుక్రవారం కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్ష నిర్వహించారు. లెక్కింపు కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించాలని సూచించారు. దీంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. కౌంటింగ్ సెంటర్లకు సమీపంలో ప్రజలు అధిక సంఖ్యంలో గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద జిల్లా స్థాయి అధికారి ఇన్చార్జిగా నియమించాలని కలెక్టర్లకు సూచించారు.