శ్రీశైలం : శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం శ్రీ భ్రమరాంబ దేవి బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిచ్చింది. పరాశక్తుల్లో రెండో రూపమైన ఈ అమ్మవారు కుడిచేతిలో అక్షమాలను ఎడమచేత కమండలాన్ని ధరించి ఉంటుంది. బ్రహ్మచారిణి సమేతుడైన ముక్కంటీశుడు సాయంత్రం మయూర వాహనంపై విహరించారు.
శ్రీశైలంలో దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఉత్సవం వైభవంగా సాగింది. అమ్మవారికి ఉదయం విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టాపారాయణాలు, చండీహోమం, పంచాక్షరీ, భ్రామరీ, చతుర్వేద పారాయణాలు కుమారి పూజలు జరిపించారు. మంగళవారం భ్రామరీ అమ్మవారిని సింహమండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బ్రహ్మచారిణీ రూపంలో అలంకరించి విశేష అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల, మానసిక ఒత్తిళ్ళు తొలిగి, సర్వత్రా విజయం కలుగుతాయని, అమ్మవారి ఉపాసన వలన త్యాగం, వైరాగ్య భావాలు కలుగుతాయని దేవిభాగవతంలో చెప్పారు.
అనంతరం అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీభ్రామరాంబ మల్లికార్జునుడు మయూరవాహనాన్ని అధిష్టించి భక్తులను కరుణించారు. స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరింపజేసి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. గ్రామోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లు ఉత్సవ మూర్తులు గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నంది మండపం నుంచి బయలు వీరభధ్రస్వామి వరకు విహరిస్తూ భక్తాదులను కరుణించారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, మహిళా వీరగాని కన్నడ జానపద కళాప్రదర్శన, రాజభటుల వేషాలు, కేరళ వారి కథకళి వేషాలు, తప్పెట చిందు, లంబాడి నృత్యం, కాళికా నృత్యం, చెక్కభజన, కోలాటం, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లగ్రోవి, త్రిశూలం, జేగంట, కురవడోలు, కొమ్ము, నందికోలు సేవ మొదలగు వివిధ రకాల విన్యాసాలతో ఆద్యాంతం కనులపండువగా సాగింది. ఉత్సవం తర్వాత సువాసిని పూజ, కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ ఆదిదంపతులకు ఆస్థానసేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మెన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల్లో మూడవ రోజు బుధవారం సాయంత్రం అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమివ్వగా స్వామివారు రావణ వాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈఓ లవన్న తెలిపారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు స్వామి అమ్మవార్లకు చేస్తున్న గాత్ర నృత్య నివేదనల ప్రత్యక్ష ప్రసారాలను శ్రీశైల టీవీ ఛానల్ సోషల్ మీడియా ద్వారా వీక్షించవచ్చని ఈవో తెలిపారు.