Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం దసరా మహోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి దంపతులు, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి (ఈవో) లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు సోమవారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ఆలయ ముఖద్వారం నుండి ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణలు చేశారు.
అటుపై అర్చక వేదపండితులు అమ్మవారి యాగశాల ప్రవేశం గణపతిపూజ, అఖండ దీపస్థాపన, దీక్షా సంకల్పం, ఋత్విగరణం, మండపారాధన తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
అలాగే స్వామివారి ఆలయ యాగశాల ప్రవేశం, శివ సంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ,వాస్తు పూజ, రుద్రకలశ స్థాపన, స్వామివారికి మహన్యాస పూర్వక రుధ్రాభిషేకం చేశారు.
మధ్యాహ్న కాలార్చన, సహస్ర నామార్చన, మహా నివేదన తర్వాత సాయంకాలం జపానుష్టానాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, నవవార్చన, కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమం జరిపారు. తదుపరి శ్రీశైల ఖండ మహాపురాణ పారాయణం నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ తెలిపారు.
రాత్రి సువాసినీ పూజ, కాళరాత్రిపూజలతో తొలిరోజు నవరాత్రి మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు.
లోక కళ్యాణం కోసం జరిపే నవరాత్రి మహోత్సవాలతో దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని మహాసంకల్పాన్ని ఋత్వికలు పఠించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, ఎఈవో డి.మల్లయ్య, హరిదాసు, మోహన్, సెక్యూరిటీ అధికారి నర్సింహారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో దసరా మహోత్సవాల్లో తొలి రోజు వేడుక వైభవంగా సాగింది. సోమవారం భ్రామరీ అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శైలపుత్రి రూపంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.
ద్విభుజాలు కలిగి కుడి చేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి అమ్మవారు వృషభ వాహనంపై దర్శనమిచ్చారు.
సతీదేవి ఉత్తర జన్మలో పర్వతరాజు హిమవంతునికి పుత్రికగా జన్మించడంతో శైలపుత్రిగా పేరొందింది. ఈ దేవిని పూజించడంతో విశేష ఫలితాలతో పాటు సర్వత్రా విజయాలు వరిస్తాయి.
తదుపరి అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీభ్రామరి సహిత మల్లికార్జునుడు భృంగివాహనాన్ని అధిష్టించి భక్తులను కటాక్షించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరింపజేసి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు.
గ్రామోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గంగాధర మండపం నుండి మొదలు నంది మండపం వరకు, నంది మండపం నుండి బయలు వీరబధ్రస్వామి వరకు విహరిస్తూ భక్తాదులను కరుణించారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, మహిళా వీరగాని కన్నడ జానపద కళాప్రదర్శన, రాజభటుల వేషాలు, కేరళ వారి కథకళి వేషాలు, తప్పెట చిందు, లంబాడి నృత్యం, కాళికా నృత్యం, చెక్కభజన, కోలాటం, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లగ్రోవి, త్రిశూలం, జేగంట, కురవడోలు, కొమ్ము, నందికోలు సేవ వివిధ రకాల విన్యాసాలతో ఆద్యంతం కనులపండువగా సాగింది.
భూమండలానికి నాభిస్థానమై అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదైన శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు నవరాత్రుల్లో తొలిరోజు శైలపుత్రిగా భక్తులను కరుణించారు.
ఈ దేవి ద్విభుజాలు కలిగి కుడి చేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి వృషభ వాహనంపై దర్శనమిచ్చింది. అనంతరం భ్రామరి సహిత మల్లికార్జునుడు భృంగివాహనాన్ని అధిష్టించి భక్తులను కటాక్షించారు.
శరన్నవరాత్రుల్లో రెండవ రోజు మంగళవారం సాయంత్రం అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిస్తారు. స్వామివారు మయూరవాహన సేవలో దర్శనమిస్తారని ఈవో లవన్న తెలిపారు.