-సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
-భౌతిక తరగతుల నిర్వాహణకు ఏర్పాట్లు
మణికొండ : గడిచిన రెండేండ్లుగా కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలకు తాళం వేసిన విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ విజృంభణతో విద్యాభోధనలన్నీ ఆన్లైన్కే పరిమితమైయ్యాయి. దీంతో విద్యార్థులు తమ రెండేండ్లపాటు ఆడుతూపాడుతూ చదువుకునే రోజులను పూర్తిగా కోల్పోయారనే చెప్పాలి. ఇటీవల కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను సర్కారు వేగవంతంగా చేపడుతుండటంతో పాటు గడిచిన మూడు మాసాలుగా కరోనా పాజిటివిటీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ ఊరూవాడల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరింత వేగంపెంచింది టీఆర్ఎస్ సర్కారు. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతున్న తరుణంలో ఆన్లైన్ పాఠాలకే పరిమితమైన విద్యార్థులను పాఠశాలలకు రప్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేపడుతూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్, కలెక్టర్ అమోయ్కుమార్లు ఆయా గ్రామపంచాయతీ సర్పంచ్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, కమీషనర్లతో రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫిరెన్సును నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు ఆదేశాలను వారు జారీచేశారు. ప్రతి మున్సిపల్, పంచాయతీ పరిధిలోని పాఠశాలలను,పరిసరాలను పరిశుభ్రంగా చేసి ప్రతి తరగతి గదిలో శానిటైజేషన్, విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా కనీసం ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు అడుగుల దూరం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలలతో పాటుగా స్థానిక అంగన్వాడీలను కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖున తెరవాలని సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 30 లోగా విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి అందుబాటులో ఉంచాలని సూచించారు.
నేటి నుంచి పాఠశాలలను పరిశీలించనున్న అధికార యంత్రాంగం
రాష్ర్ట వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటుగా స్థానిక ఆరోగ్యకేంద్రాలను పరిశీలించనున్నారు. అదేవిధంగా విద్యార్థుల కోసం ప్రత్యేక శానిటైజేషన్ మిషన్లను, స్ప్రేయర్ బాటిళ్లను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఆయా పాఠశాలలను క్లస్టర్లు విభజించి విద్యార్థుల్లో ఏవైనా అనారోగ్య సమస్యలుంటే తక్షణమే పరీక్షలు చేయించుకునేలా స్థానిక బస్తీ దవాఖాన, ఆరోగ్య కేంద్రాల వద్ద బెడ్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.