బోసిపోయిన బడి గోడలు కొత్త అందాలు సంతరించుకొన్నాయి. నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారుల కిలకిల రావాల ఆనందహేల గలగలా సవ్వడి చేసింది. అడుగులో అడుగు వేస్తూ బాల సైనికులు బడి ఒడిలోకి అడుగుపెట్టారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని 41 వేల పాఠశాలలు సోమవారం తెరుచుకొన్నాయి. పాత, కొత్త స్నేహితులతో కొత్త తరగతి గదిలో పిల్లలంతా మొదటిరోజు సందడిగా గడిపారు. దాదాపు రెండేండ్ల తర్వాత జూన్ 12న బడులు తెరుచుకోవటంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలికారు.ఈ ఏడాది నుంచే ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభం కావటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ఉత్సాహంతో బడిలోకి అడుగుపెట్టారు. మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడిలో భాగంగా చాలాచోట్ల ఆకర్షణీయమైన బొమ్మలు, రంగురంగుల చిత్రాలతో అలంకరించిన స్కూల్ గోడలను చూసి విద్యార్థులు ఇది మా స్కూలేనా అన్నట్టు ఆశ్చర్యపోయి ఆసక్తిగా తిలకించారు.
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: వేసవి సెలవులు ముగియటంతో పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. నెలన్నర విరామం తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో స్కూళ్లలో కోలాహలం నెలకొన్నది. తొలిరోజు విద్యార్థులకు టీచర్లు, ప్రజాప్రతినిధులు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ గన్ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వాగతం పలికారు.
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రాంపూర్ పాఠశాలను సందర్శించారు. ఈ నెల 30 వరకు విద్యార్థులకు బిడ్జ్రికోర్సులో భాగంగా కింది తరగతుల్లో చదివిన పాఠ్యాంశాల్లో ముఖ్యమైన వాటిని తిరిగి బోధించనున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నాటికి కొత్తగా 79,635 వేల మంది విద్యార్థులను చేర్పించారు. సోమవారం ఒక్కరోజే 8,937 మంది చేరారు. వీరిలో 2,246 మంది ్రప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడుల్లో చేరడం గమనార్హం.
సర్కారు బడిలో కార్పొరేట్ విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందుకోసం మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సోమవారం విద్యా సంవత్సరం పునఃప్రారంభం సందర్భంగా గన్ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. పాఠశాలలో ప్రత్యేకంగా గోడలపై వేసిన పెయింటింగ్ను చూసి ఆనందం వ్యక్తం చేశారు.
పాఠశాలలో చిన్నారులను చేర్పించేందుకు వచ్చిన తల్లి దండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపడం అభినందనీయమని అన్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తొలిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు హెడ్మాస్టర్ సుధారాణి, టీచర్లు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు అర్ధమయ్యేలా విద్యా భోధన చేస్తున్నామని సుధారాణి తెలిపారు. మెరుగైన వసతులు కల్పించడంతో పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని వెల్లడించారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పెద్దమ్మ తండాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి.. రొట్టెలు చేసి వారితో మమేకమయ్యారు.
– కందుకూరు