అమీర్పేట్ :సుదీర్ఘకాలం తరువాత పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కొవిడ్ పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్న నేపధ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు పాఠశాలలు తరగతులకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పైవేట్ పాఠశాలలు 1వ తేదీ నాటికి ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాయి. సనత్నగర్ అమీర్పేట్ పరిసరాల్లో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలగా పేరున్న అమీర్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతి గదులను శుభ్రం చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూధన్ ఈ మేరకు జీహెచ్ఎంసీతో పాటు పైవేట్ సిబ్బందిని వినియోగిస్తూ 800 మంది విద్యార్ధులు నిత్యం కదలాడే ఈ పాఠశాల ఆవరణను తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక్కడి ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయులు 300 మంది విద్యార్ధులు, ఉన్నత పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులతో కలిపి 500 మంది విద్యార్ధులు చదువుతున్నారు.
ఇక ఈ పాఠశాలలో విద్యార్ధులకు తాగు నీరందించే ట్యాంకులకు అవసరమైన మరమ్మతులు చేపడుతూ లోపలి భాగాలను శుభ్రం చేసే పనులను చేపడుతున్న పైవేట్ సిబ్బందిని ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 30 తరగతి గదులున్న ఈ పాఠశాల ఆవరణలో ప్రతి టేబుల్, బెంచీలను శుభ్రం చేస్తున్నారు. సెప్టెంబర్ 1 న పాఠశాల తెరుచుకునే నాటికి విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రధానోపాధ్యాయులు మధుసూధన్ తెలిపారు. విద్యార్ధులు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి నిత్యం శానిటైజేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.