హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ ఉత్పత్తుల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ ఫ్రాన్స్కు చెందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ తన రెండో ఫ్యాక్టరీని హైదరాబాద్లో ఏర్పాటుచేయనున్నది. విద్యుత్తు నిర్వహణ, ఆటోమేషన్లో డిజిటల్ పరివర్తనకు సంబంధించిన ఈ సంస్థ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ జీఎంఆర్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రూ.300 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక స్మార్ట్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నది. మూడు దశల్లో ఏర్పాటు కానున్న ఈ ఫ్యాక్టరీని మొదటి దశలో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నది. వెయ్యి మందికి ఉద్యోగ అవకాశం లభించనున్నది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. మొత్తం మూడు దశల్లో రూ.900 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, మొత్తం 3 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. గురువారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో కంపెనీ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, భారత్లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 30 ఫ్యాక్టరీలు ఉండగా, భారత్లోనే ఏడు ఉన్నాయి. తెలంగాణలో ఇది రెండో ఫ్యాక్టరీ. ఇప్పటికే 1,400 నుంచి 1,700 మందికి ఉద్యోగాలు కల్పించింది.
హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ష్నైడర్ ఫ్యాక్టరీ నుంచి 75 శాతం ఉత్పత్తులు దేశవిదేశాలకు ఎగుమతి చేయనుండటం గర్వంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు నిర్మించనున్న పరిశ్రమ దేశంలోనే అతి పెద్దదని చెప్పారు. హైదరాబాద్లో ష్నైడర్ ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసి స్థానిక యువతకు శిక్షణ అందించాలని కోరారు. ఇక్కడ ప్రతిభకు కొదవలేదని, శిక్షణ కేంద్రం ద్వారా యువతను నిపుణులుగా తీర్చిదిద్దితే కంపెనీ అవసరాలకు తోడ్పడతారని చెప్పారు. ఇప్పటికే జపాన్కు చెందిన తోషిబా సంస్థ ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు గుర్తుచేశారు. ష్నైడర్ పరిశ్రమ ఏర్పాటుతో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నదని స్పష్టంచేశారు.
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు స్నేహపూర్వక వాతావరణం ఉన్నదని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యూయేల్ లెనైన్ పేర్కొన్నారు. భారత్లో ష్నైడర్ ఎలక్ట్రిక్ దశాబ్దాలుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండటం బలమైన ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అనిల్ చౌదరి మాట్లాడుతూ.. త్వరలో ప్రారంభం కానున్న స్మార్ట్ ఫ్యాక్టరీ దేశంలోని అగ్రగామి తయారీ కేంద్ర ంగా హైదరాబాద్ కీర్తిని ఇనుమడింపజేస్తుందని చెప్పారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ స్మార్ట్ ఫ్యాక్టరీకి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి అడ్వాన్స్డ్ లైట్హౌస్ గుర్తింపు లభించిందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జావెద్ తెలిపారు.