SBI MCLR Hike | ఆర్బీఐ రెపోరేట్ పెంపునకు అనుగుణంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కీలక వడ్డీరేట్లు పెంచివేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 20 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని టెన్యూర్ల రుణాలపై తక్షణం (2022, ఆగస్టు 15) అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రెపోరేట్ 50 బేసిక్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే.
ఎస్బీఐ ఎంసీఎల్ఆర్, ఈబీఎల్ఆర్ (ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్), రెపోలింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) పెంచేయడంతో ఇండ్ల రుణాల నుంచి వ్యక్తిగత, వాణిజ్య రుణాలు, వాహన రుణాలు పిరం కానున్నాయి. ఆయా రుణాలు తీసుకున్న వ్యక్తులపై నెలవారీ వాయిదా (ఈఎంఐ) భారం పెరగనున్నది.
ఎస్బీఐ ఓవర్నైట్, నెల, మూడు నెలల గడువు గల టెన్యూర్ రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.35 శాతం కాగా, ఆరు నెలల టెన్యూర్ లోన్లపై 7.65, ఏడాది టెన్యూర్ రుణాలపై 7.70, రెండేండ్ల గడువు గల లోన్ మీద 7.90, మూడేండ్ల టెన్యూర్ రుణంపై ఎనిమిది శాతం ఎంసీఎల్ఆర్ అమలవుతుంది. ఎస్బీఐ మూడు నెలల్లో మూడుసార్లు ఎంసీఎల్ఆర్ పెంచివేసింది.
ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) 50 బేసిక్ పాయింట్ల చొప్పున పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే తమ ఎంసీఎల్ఆర్ రేట్లు సవరించేశాయి.