భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇండ్ల రుణాలు పిరం కానున్నాయి. అన్ని టెన్యూర్ల రుణాలపై ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 25 బేసిక్ పాయింట్లు (బీపీఎస్) పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. నూతన ఎంసీఎల్ఆర్ రేట్లు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఆర్బీఐ రెపోరేట్ పెంపునకు అనుగుణంగా ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్ ఓవర్నైట్, నెల, మూడు నెలల గడువు గల రుణాలపై 7.35 నుంచి 7.60 శాతం, ఆరు నెలల టెన్యూర్పై 7.65 నుంచి 7.90, ఏడాది గడువు గల లోన్పై 7.70 నుంచి 7.95 శాతం ఎంసీఎల్ఆర్ పెరిగింది. రెండేండ్ల టెన్యూర్ రుణంపై 7.90 నుంచి 8.15 శాతానికి, మూడేండ్ల టెన్యూర్ రుణంపై 8 నుంచి 8.25 శాతానికి ఎంసీఎల్ఆర్ పెరుగుతుందని ఎస్బీఐ వెబ్సైట్ ప్రకటించింది.
గడువు —- — ప్రస్తుత ఎంసీఎల్ఆర్ ——- సవరించిన ఎంసీఎల్ఆర్
(శాతం) —————— (శాతం)
ఓవర్నైట్ —- —- 7.35 —————- — 7.6
ఒక నెల ———- 7.35 —————– — 7.6
3 నెలలు ——— 7.35 ——————— 7.6
6 నెలలు ———- 7.65 ——————– 7.9
ఏడాది ———— 7.7 ———————- 7.95
రెండేండ్లు ——— 7.9 ———————- 8.15
మూడేండ్లు ——– 8 ———————– 8.25
కస్టమర్లు తీసుకునే రుణాలపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. వివిధ రుణాలపై 2016లో ఎంసీఎల్ఆర్ పాలసీని ప్రవేశపెట్టింది. 2019 సెప్టెంబర్ 30 వరకు ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలను బ్యాంకులు అమలు చేశాయి. బ్యాంకుల రుణాలపై ఖరారు చేసే బెంచ్మార్క్ వడ్డీరేటే ఎంసీఎల్ఆర్.
రుణంపై వడ్డీరేటు పెరిగితే ఎంసీఎల్ఆర్ ఆటోమేటిక్గా రుణాల కాస్ట్పై ప్రభావం చూపుతుంది. రుణాలపై వడ్డీరేటు పెరిగితే నెలవారీ ఈఎంఐలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు ఎక్కువ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసీఎల్ఆర్పై ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపైనా ఈఎంఐ ప్రభావం పడుతుంది. ఎంసీఎల్ఆర్ బేస్డ్ రుణాలు ఆరు నెలల నుంచి ఏడాది టెన్యూర్లపై ఆధారపడి మంజూరు చేస్తాయి బ్యాంకులు. ఎంసీఎల్ఆర్కు అనుగుణంగా బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లు పెంచుతాయి. ఎంసీఎల్ఆర్ కింద కొత్తగా రుణాలు తీసుకున్న వారు అధిక ఈఎంఐలు పే చేయాల్సి ఉంటుంది.
గత మే నుంచి ఐదు నెలల్లో నాలుగు సార్లు ఆర్బీఐ రెపోరేట్ పెంచేసింది. బ్యాంకులు కూడా ఆర్బీఐ రెపోరేట్ పెంపునకు అనుగుణంగా వడ్డీరేట్లు పెంచేశాయని బ్యాంక్ బజార్ సీఈవో అదిల్ శెట్టి చెప్పారు. దీని ప్రకారం నూతన రుణ గ్రహీతలు, పాత రుణ గ్రహీతలకు రుణాలు భారంగా పరిణమిస్తాయన్నారు. ఫ్లోటింగ్ వడ్డీరేట్లపై రుణాలు తీసుకున్న వారి ఇండ్ల, కారు, వ్యక్తిగత, విద్యా రుణాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవని వ్యాఖ్యానించారు. తక్కువ వడ్డీరేటుపై రుణాల మంజూరు విధానానికి కాలం చెల్లినట్లేనన్నారు అదిల్ శెట్టి. రుణాలు అత్యంత ఖర్చుతో కూడిన విధానం దిశగా మనం వెళుతున్నామని మై మనీ మంత్ర డాట్ కామ్ ఫౌండర్- ఎండీ రాజ్ ఖోస్లా చెప్పారు.