మహబూబ్నగర్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాల్లో జీవాల పెంపకం ముఖ్యమైన వృత్తి. ఏటా జీవాల్లో వచ్చే వివిధ రకాల వ్యాధులతో పాడి రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఏ కాలంలో సమస్యలు ఆ కాలంలో ఉంటా యి. ఇది మనుషులకే కాదు మూగజీవాలకూ వర్తిస్తుంది. పాడిపరిశ్రమ విషయంలో వానకాలంలో రైతులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశువులు సరిగా మేత మేయక పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధు లు సోకిన గొర్రెలు, మేకలు, పశువులు మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉన్నది. వానకాలంలో వ్యాధులు జీ వాల పెంపకందారులకు కంటిమీద కునుకు లేకుండా చే స్తాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులబారి నుంచి జీ వాలను కాపాడుకోవచ్చని పశువైద్యులు సూచిస్తున్నారు. పశువులు అనారోగ్యానికి గురైనట్లు గుర్తించగానే సంచార పశు వైద్యశాల టోల్ఫ్రీ నంబర్ 1962కు సమాచారం అందించి వైద్య సహాయం పొందొచ్చు.
వానకాలంలోనే వ్యాధుల సంక్రమణ అధికం..
వర్షాలు, వరదలతో పరిసరాలు, వాతావరణం కలుషితమవుతాయి. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు లో తట్టు గ్రామాల్లో పశువులు తినడానికి సరైన మేత, తాగడానికి శుభ్రమైన నీరు అందుబాటులో ఉండవు. దీంతో పశువులు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురవుతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గి అంటువ్యాధుల బారినపడే ప్ర మాదం ఉన్నది. వ్యాధి సోకిన పశువులు, ఆరోగ్యంగా ఉ న్న పశువుల మందలో ఉన్నప్పుడు వాటికి సైతం సోకే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.
బురదపుండ్లు..
పశువులు, ఇతర అనేక జీవాల్లో కనిపిస్తుంది. గిట్టలు మెత్తబడడం, గిట్టల్లో పగుళ్లు, రక్తం కారడం, కాలు కుంటడం, గిట్టలు ఊడిపోవడం వంటివి జరుగుతుంటాయి. గొర్రెలు, మేకలు ఎక్కువగా జ్వరం వచ్చి చనిపోతాయి. పశువులు బురద, పేడ, మూత్రాల్లో నిల్చున్నప్పుడు బ్యాక్టీరియా గిట్టల్లోకి ప్రవేశించి వ్యాధిబారిన పడతాయి. గిట్టల మధ్య ఎడం తక్కువగా ఉన్న పశువులకు ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. పశువులను ఎప్పటికప్పుడు పొడిగా ఉన్నచోట కట్టేయాలి. పశువుల పాకలను సైతం శుభ్రంగా ఉంచేలా చూడాలి.
నివారణ చర్యలు : ఈ వ్యాధి సోకిన జీవుల గిట్టలను 5శాతం పార్మాలిన్ ద్రావణంలో 10 నిమిషాల వరకు మునిగేట్లు ఉంచి తర్వాత శుభ్రంగా తుడవాలి. తుడిచిన గిట్టలకు జింక్ ఆక్సైడ్, కాపర్సల్ఫేట్ వంటి ఆయింట్మెంట్ పూయాలి.
జలగ వ్యాధి..
జలగ వ్యాధి పరాన్న జీవులతో వస్తుంది. వ్యాధి బారిన పడిన పశువుల పేడ ద్వారా జలగల గుడ్లు నేల మీద పడతాయి. ఈ ప్రదేశాల్లో మొలచిన గడ్డిని పశువులు మేయడం ద్వారా గుడ్లు పశువుల కాలేయంలోకి వెళ్లి వ్యాధిని కలిగిస్తాయి. వ్యాధి సోకిన పశువులకు ఆకలి మందగిస్తుంది. దవడ కింద నీరు వచ్చి వాపు వస్తుంది. పేడ పలుచగా ఉండి దుర్వాసన వస్తుంది. పాల ఉత్పత్తి తగ్గుతుంది.
నివారణ చర్యలు..
వ్యాధి సోకిన పశువును గుర్తించి వైద్యుని సలహాతో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధికి సంబంధించిన మందులు సకాలంలో వాడితే వ్యాధిని నిర్మూలించవచ్చు.
గాలికుంటు వ్యాధి..
వైరస్ ప్రభావంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు ఎక్కువగా సోకుతుంది. కలుషితమైన గాలి ద్వారా సోకుతుంది. తల్లిపాల ద్వారా దూడలకు వ్యాపించే అవకాశం ఉంది. దేశవాళి పశువుల కన్నా సంకరజాతి దూడల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ. ఈ వ్యాధి సోకిన పశువులకు జ్వరం 104 నుంచి 108 డిగ్రీల వరకు ఉం టుంది. నోరు, గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి చొంగ కారడం వ్యాధి లక్షణాలు. పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గుతుంది.
నివారణ చర్యలు : నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడ ర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లను పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. ఏప్రిల్, సెప్టెంబర్ లో వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తే వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చు.
చిటుక వ్యాధి..
దీనిని మెడరసం వ్యాధి అని కూడా అంటారు. ఇది ఎక్కువగా గొర్రెలకు సోకుతుంది. మేకలకు అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది. నేలలోనూ, పశువుల పేగుల్లోనూ నివసించే ఒకరకం బ్యాక్టీరియాతో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పెద్ద గొర్రెలకు మాత్రమే ఈ వ్యాధి వస్తుంది. చాలా సేపు ఆకలితో ఉండి ఒకేసారి పెద్దమొత్తంలో ఆహారం తీసుకోవడం ద్వారా, వేసవికాలం ముగిసి తొలకరి జల్లుల సమయంలో ఒకేసారి ఎండుమేత నుంచి పచ్చిమేతకు మారడంతో ఈ జబ్బు వస్తుంది. అప్పుడే పుట్టిన గొర్రెలకు సైతం తల్లి నుంచి బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది.
నివారణ చర్యలు : ఈ జబ్బు రాకుండా ఉండేందుకు వానకాలం ప్రారంభమవ్వగానే టీకాలు వేయించాలి. మూడు నెలలు దాటిన ప్రతి గొర్రె పిల్లకూ వ్యాధినిరోధక టీకాలు వేయించాలి. రెండు నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయించాలి. గొర్రెలకు నట్టల మందు వేసి, అప్పుడప్పుడు తూకం వేయాలి. ఈ జబ్బుకు ఎలాంటి చికిత్స లేదు. జబ్బు సోకిన గొర్రెలు సాధారణంగా చనిపోతూనే ఉంటాయి.
గొంతువాపు వ్యాధి..
ఈ వ్యాధిని గురక వ్యాధి అంటారు. కలుషితమైన మేత, నీటి ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఒక పశువు నుంచి వేరొక పశువుకు సోకుతుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలకు పైగా ఉంటుంది. గొంతు కిందకు నీరుదిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగకారుస్తూ గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కండ్ల నుంచి ఊసు వస్తుంది.
నివారణ చర్యలు : వ్యాధి నిరోధక టీకా వేయించాలి. పాకలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి.
గొర్రెల్లో నీలి నాలుక ..
గొర్రెల్లో వైరస్ల నుంచి సోకే వ్యాధుల్లో నీలి నాలుక వ్యాధి ప్రధానమైనది. దీన్నే మూతి వ్యాధి, కూత రోగం అని కూడా అంటారు. ఈ వ్యాధి క్యూలికాయిట్ అనే దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఉండే వాతావరణంలో నీలి నాలుక వైరస్ అభివృద్ధి, ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారినపడిన గొర్రెలు మేతతోపాటు నెమరువేయడం మానేస్తాయి. జ్వరం ఎక్కువగా ఉండి మొహం, పెదవులు వాచి ఉంటాయి. నోటి భాగం లోపల ఎర్రబడి పొక్కులు ఏర్పడతాయి. నాలుక వాచి నీలిరంగులోకి మారుతుంది. కాళ్ల గిట్టలు వాచి పుండ్లు ఏర్పడుతాయి. వ్యాధి సోకిన వారం రోజుల తర్వాత గిట్టల నుంచి రక్తం కారి గొర్రె కుంటుతుంది. ఆహారం తీసుకోక వ్యాధి సోకిన గొర్రె పది రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది.
నివారణ చర్యలు : నోటిలోని పుండ్లను ఒక శాతం బోరిక్యాసిడ్ లోషన్తో శుభ్రం చేయాలి. రెండు శాతం బోర్లి గ్లిజరిన్ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకు రాగి జావ, మక్కజొన్న జావ, ఆకులను ఆహారంగా ఇవ్వాలి. ఐదు రోజుల పాటు ఒక్కో గొర్రెకు వైద్యుల సలహా, సూచన మేరకు యాంటీబయాటిక్ టీకాలను వేయించాలి. బాగా నీరసించిన గొర్రెలకు గ్లూకోజ్ ద్రావణం ఎక్కించాలి.
అనారోగ్యంగా ఉండే పశువులు..
అనారోగ్యానికి గురైన పశువుల మూత్రం వరిగడ్డి రంగులో ఉంటుంది. కండ్ల నుంచి ఊసు, నీరు కారుతాయి. నెమరు వేయదు. తీవ్రమైన జ్వరం ఉంటుంది. చెవులు కిందికి జారి నిరసించినట్లు కనపడతాయి.
ఆరోగ్యంగా ఉండే పశువులు..
ఆరోగ్యకరమైన పశువులు తోక, చెవులు ఎప్పు డూ ఆడిస్తూ చురుగ్గా ఉంటాయి. నిత్యం నెమరువేస్తాయి. కాలి మడమ చెమ్మగా ఉంటుంది. పేడ ఆకుపచ్చగా ఉంటుంది. పాల ఉత్పత్తిలో మార్పు ఉండదు. పశువుల ఆరోగ్య పరిస్థితిని రోజూ ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు, మేత వేసేటప్పుడు గమనిస్తూ ఉండాలి.