అమరావతి : శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీలు మృత్యువాత పడిన ఘటన అత్యంత విచారకరమని వెంకయ్య నాయుడు అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
విద్యుత్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా అని పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచడంపై చూపించే శ్రద్ధ విద్యుత్ లైన్ల నిర్వహణపై చూపాలని సూచించారు. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు ఒరిగి, వేలాడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.