‘రైతు సమస్యలపై చర్చించేందుకు నేను ప్రధానితో భేటీ అయ్యా. ఆయన దురహంకారపూరితంగా ప్రవర్తించారు. ఉద్యమంలో 500 మంది రైతులు మరణించారని నేను ప్రధానికి చెప్పా. ‘వారు నా కోసం చనిపోయారా?’ అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. మా మధ్య వాగ్వాదం కొనసాగింది. ఆ తర్వాత అమిత్ షాను కలవమని మోదీ నాకు సూచించారు. నేను వెళ్లి కలిశా. ‘సత్యా, ఆయనకు (మోదీకి) మతిపోయింది.’ అని షా నాతో అన్నారు.
-మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్
న్యూఢిల్లీ, జనవరి 3: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, రైతు సమస్యలను ప్రధాని మోదీతో చర్చించడానికి వెళ్లినప్పుడు ఆయన అత్యంత దురహంకారపూరితంగా ప్రవర్తించారని మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమంలో 500 మందికి పైగా రైతులు మరణించారని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా.. తన కోసం చనిపోయారా? అని ప్రధాని ఎదురు ప్రశ్నించారని తెలిపారు. హర్యానాలోని దాద్రిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘రైతు సమస్యలపై చర్చించేందుకు నేను ప్రధాని మోదీతో భేటీ అయ్యా. ఈ అంశంపై మా మధ్య ఐదు నిమిషాల పాటు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అప్పుడు ఆయన దురహంకార పూరితంగా ప్రవర్తించారు. నిరసనల్లో ఇప్పటివరకు 500 మంది రైతులు మరణించారని నేను ప్రధానికి చెప్పా. ‘నా కోసం చనిపోయారా?’ అంటూ ఆయన నన్ను ఎదురు ప్రశ్నించారు. అవును, దేశాన్ని పాలించేది మీరే గనుక.. వాళ్లు మీకోసమే చనిపోయారని బదులిచ్చా. అనంతరం కొంత సమయంపాటు మా మధ్య వాగ్వాదం కొనసాగింది. ఆ తర్వాత అమిత్ షాను కలవాలని మోదీ నాకు సూచించారు. నేను వెళ్లి కలిశా’ అంటూ మాలిక్ పేర్కొన్నారు.
ఆయనకు మతిపోయింది!
మోదీ సూచించినట్టే తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశానని మాలిక్ తెలిపారు. ‘నేను అమిత్ షాను కలిశా. అప్పుడు ఆయన.. ‘సత్యా, ఆయనకు (మోదీకి) మతిపోయింది. మీరు తరుచుగా కలవండి’ అని సూచించినట్టు మాలిక్ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోపై పెద్దఎత్తున దుమారం రేగడంతో మాలిక్ సోమవారం వివరణ ఇచ్చారు. ‘రైతుల పట్ల నా ఆందోళనలను ప్రధాని మోదీ వినే స్థితిలో లేరు. అనంతరం అమిత్ షాను కలవాల్సిందిగా ప్రధాని నాకు సూచించారు. నిజానికి అమిత్ షాకు మోదీ అంటే అపారమైన గౌరవం. ప్రధానిపై దురుద్దేశంతో అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కొందరు ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్నట్టు మాత్రమే షా నాతో చెప్పారు. ఏదో ఒకరోజు ప్రధాని ఈ విషయాన్ని గ్రహిస్తారని, మీ ఆందోళనలను అర్థం చేసుకొంటారని నాకు చెప్పారు’ అని మాలిక్ వెల్లడించారు. తన వ్యాఖ్యలను విపక్షాలు రాజకీయం చేయవద్దని కోరారు.
ప్రజాస్వామ్యానికి ప్రమాదం
రైతులపై ప్రధాని మోదీ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలను విపక్ష కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా ఖండించారు. గర్వం, క్రూరత్వం, సున్నితత్వలేమితో కూడిన ప్రధాని మోదీ అసలు స్వభావాన్ని ఓ గవర్నర్ బయటపెట్టారని, ఇది ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించే అంశమన్నారు. మోదీ దురహంకారం వల్ల యావత్ జాతి పెద్ద మూల్యమే చెల్లించుకోనున్నదని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.