హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కర్ణాటక యాక్టింగ్ సీజేగా పని చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పని చేసిన జస్టిస్ హిమాకోహ్లి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ప్రస్తుతం తాత్కాలిక సీజేగా రామచంద్రరావు కొనసాగుతున్నారు. అయితే సుప్రీం కొలీజియం చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపారు. ఆంధ్రప్రదేశ్ సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమిస్తూ కూడా సుప్రీం కొలీజియం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
8 మంది కొత్త సీజేలు..
సుప్రీంకోర్టు కొలీజియం మొత్తం 8 మంది జడ్జీలను వివిధ హైకోర్టులకు చీఫ్ జస్టిస్లను చేస్తూ పదోన్నతి కల్పించినట్లు తెలుస్తోంది. మొత్తం అయిదుగురు సీజేలను, 28 మంది జడ్జీలను బదిలీ చేయాలని సిఫారసు చేసింది. కొత్త సీజేలుగా నియమితులైన వారిలో.. అలహాబాద్ కోర్టుకు జస్టిస్ రాజేశ్ బిందాల్, కోల్కతా కోర్టుకు ప్రకాశ్ శ్రీవాత్సవ్, ఆంధ్రప్రదేశ్ కోర్టుకు ప్రశాంత్ కుమార్ మిశ్రా, కర్నాటక కోర్టుకు రీతూ రాజ్ అవాస్తి, తెలంగాణ హైకోర్టుకు సతీష్ చంద్ర శర్మ, మేఘాలయా కోర్టుకు జస్టిస్ రంజిస్ వీ మోరే, గుజరాత్ కోర్టుకు అరవింద్ కుమార్, మధ్యప్రదేశ్ కోర్టుకు ఆర్వీ మాలిమత్లను సీజేలుగా నియమిస్తూ సిఫారసు చేశారు. ట్రాన్స్ఫర్ అయిన సీజేల్లో.. ఏపీ నుంచి చత్తీస్ఘడ్కు అరూప్ కుమార్ గోస్వామి, మధ్యప్రదేశ్ నుంచి హిమాచల్ ప్రదేశ్కు మొహమ్మద్ రఫిక్, త్రిపుర నుంచి రాజస్థాన్కు అఖిల్ ఖురేషి, రాజస్థాన్ నుంచి త్రిపురకు ఇంద్రజిత్ మహంతి, మేఘాలయా నుంచి సిక్కింకు జస్టిస్ బిశ్వనాథ్ సోమద్దార్ బదిలీ అయ్యారు.