మహబూబాబాద్, ఆగస్టు 18 : బహుజనుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, కలెక్టర్ కే శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 372వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గౌడ సంఘం నాయకుడు యమగాని వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో జన్మించిన పాపన్నగౌడ్ చరిత్రను గుర్తుచేసుకోవడం జాతికే గర్వకారణమన్నారు. దొరలు, భూస్వాములు, మొఘల్ సామ్రాజ్యవాదులను గెరిల్లా దళాలతో గడగడలాడించి యోధుడు పాపన్నగౌడ్ అని అన్నారు.
యుద్ధ విద్యలో ఆరితేరిన పాపన్నగౌడ్ సర్వాయిపేట, తాటికొండ, ఖిలాషాపురంలో కోటలను నిర్మించినట్లు తెలిపారు. పరిపాలనాదక్షుడిగా ప్రజల మన్ననలు పొందాడని అన్నారు. కృషి, పట్టుదల ఉంటే సామాన్యులు సైతం రాజ్యమేలవచ్చని ఆచరణలో పెట్టిన చూపిన ఘనుడు పాపన్న అని, ఆయన ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శంకర్నాయక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్నాయక్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నరసింహస్వామి, ఎక్సైజ్ సీఐ రమేశ్చందర్, డీటీఎఫ్ సీఐ కృష్ణ, ఎస్సైలు కృష్ణమూర్తి, హన్మంతరావు, గౌడ సంఘం బాధ్యులు ముత్యం వెంకన్న, గునిగంటి రాజన్న, సమ్మెట వెంకన్న, సిలివేరు సమ్మిగౌడ్, మాచర్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.