ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవ సందడి మెదలైంది. కార్తీక మాసం తొలి రోజైన శుక్రవారం శ్రీభమరాంబ మల్లిఖార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 4 వరకు జరిగే కార్తీక మాసోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. కార్తీక మాసోత్సవాలు ముగిసే వరకు గర్భాలయ సర్వదర్శనాలు పూర్తిగా నిలిపివేశామని వెల్లడించారు.
కార్తీక మాసాంతం ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ధ్వజస్తంభంపై ఆకాశ దీప ప్రజ్వలనను శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో లవన్న చెప్పారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ల టైం స్లాట్ల ప్రకారం స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు. నాలుగు విడతలుగా జరిగే సామూహిక అభిషేకాలు, రుద్రహొమం మరియు చండీ హోమం, నిత్యకళ్యాణాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అల్పాహార భోజన ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్తీక దీపాలు వెలిగించేందుకు ఆలయ ప్రాకారంలోని నాగులకట్ట వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. చతుస్సప్తాహ భజనలతోపాటు ప్రతి సోమవారం మరియు పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద పుణ్య నదీ హారతి లక్ష దీపార్చన వైభవంగా జరిపించనున్నట్లు చెప్పారు.
శుక్రవారం ఉదయం దేవస్థాన ఉపాలయమైన ఫాలధార పంచధార వద్ద అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దయం కళారాధన మండపంలో సాంస్కృతిక మరియు భజనలు చేశారు. ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర, క్విజ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కళారాధన వేదికపై బహుమతులు ఇచ్చారు.
శ్రీశైల మహా క్షేత్రంలో విధులు నిర్వహించే సిబ్బంది, స్థానికులతో పాటు భక్తులకు ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆయుర్వేద నాడీ పరీక్ష, యోగాసనాలు, సూర్యనమస్కారాలు వంటి కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. పురాతన సంస్కృతి, కళావైభవాన్ని రక్షించుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులమేరకు ధర్మపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ దక్షిణ మాడవీధి కళారాధన వేదికపై జరిగే కార్యక్రమంలొ ప్రముఖ నాడీవైద్యనిపుణులు శ్రీమతి కొండ పూర్ణ రాజేశ్వరీ, యోగా గురువులు డాక్టర్ పీవీఎస్ లక్ష్మీ పాల్గొంటారని ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ పరిధిలోని కీలక ప్రాంతాల్లో పర్యటించిన ఈవో అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవో వెంట ఈఈ మురళీబాలకృష్ణ, అసిస్టెంట్ కమీషనర్ నటరాజ్ ఉన్నారు. కార్తీక వైభవాన్ని చెప్పే నృత్యాలు భజనలతో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.