ఉస్మానియా యూనివర్సిటీ :ఒక గ్రామానికి ఐదేండ్లు సర్పంచ్గా పనిచేయడమే కష్టం. కానీ ఏకంగా 42 ఏండ్లు పనిచేస్తే…. నిజంగా అది అరుదైనదే కదా! ఒక గ్రామానికి 42 ఏండ్లు సర్పంచ్గా కొనసాగి అరుదైన రికార్డు నెలకొల్పిన కేంద్యాల వీరస్వామి (90)కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. అంతేకాకుండా ఎనిమిది సార్లు సర్పంచ్గా వరుసగా ఎన్నికై ప్రజాసేవకు అంకితమైనందుకు ఆయనకు జీవన సాఫల్య పురస్కారాన్ని సైతం అందజేశారు. తార్నాకలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత డాక్టర్ చింతపట్ల వెంకటాచారి చేతుల మీదుగా ఆయనకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి సర్పంచ్గా 8 సార్లు వరుసగా ఎన్నికై 42 ఏండ్లు సుదీర్ఘకాలం సర్పంచ్గా పనిచేశారని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో గ్రామాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. వారి పదవీ కాలంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందజేశారని ప్రశంసించారు. గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి తన సొంత భూమిని విరాళంగా అందజేయడంతో పాటు ఆర్యసమాజ్ శాఖను ఏర్పాటు చేశారని కీర్తించారు. రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడిగా విద్యావ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.