ముంబై : పత్రాచాల్ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు కష్టాలు కొనసాగుతున్నాయి. కేసులో ప్రత్యేక కోర్టు సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించింది. మరో వైపు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు నోచుకోలేదు. సంజయ్ రౌత్ పిటిషన్ను ఈ నెల 21న విచారించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ఈడీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు కస్టడీని పొడిగించింది. పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో జూలై 31న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన రౌత్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటల విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపింది.