చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. వివాహమైన కొద్దిరోజులకే ఆమె భర్త కాలంచేశారు. దీంతో ఆమె జీవితమంతా స్వాతంత్య్ర పోరాటానికే అంకితం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. మహిళా యోధురాలుగా చరిత్రలో నిలిచిపోయారు సంగెం లక్ష్మీబాయి.
స్వాతంత్య్ర సమరంలో మహిళా యోధురాలు అంటే అందరికీ సరోజినీనాయుడులాంటి కొద్దిమంది మాత్రమే స్ఫురణకు వస్తారు. కానీ, భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమ తమ ప్రాంతాల్లో చురుగ్గా పాల్గొన్న మహిళా యోధులు చాలామందే ఉన్నారు. అలాంటివారిలో సంగెం లక్ష్మీబాయి ఒకరు. ఆమె హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్లో జూలై 27, 1911న జన్మించారు. కార్వే విశ్వవిద్యాలయం, ఉన్నవ లక్ష్మీబాయమ్మ ప్రారంభించిన శారదా నికేతన్, మద్రాసు ఆర్ట్స్ కళాశాలలో విద్యనభ్యసించారు. స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. లక్ష్మీబాయికి వివాహమైన తర్వాత కొద్దిరోజులకే భర్త చనిపోయాడు. దీంతో తన జీవితాన్ని స్వాతంత్య్ర పోరాటానికే అంకితం చేశారు.
సంగెం లక్ష్మీబాయికి ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఆ పేరు పెట్టారు. తనవలే వర్ధిల్లమని దీవించారు. ఆమె వద్దే 1933 వరకూ ఏడేండ్లు సంగెం లక్ష్మీబాయి ఉన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో చురుకైన పాత్ర పోషించారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ వెంట ఊరూరా ప్రచారం చేశారు. ఓ ఏడాది జైలుశిక్ష కూడా అనుభవించారు. వినోబా భావే తొలి పాదయాత్రకు తెలంగాణాలో సారథ్యం వహించారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా మళ్లీ అరెస్టయ్యారు. రాయవేలూరు జైలుకు వెళ్లారు. 1933లో విడుదలయ్యారు. తమ గర్ల్స్ హైస్కూలుకు వార్డెన్గా ఉండాలని మాడపాటి హనుమంతరావు ఆమెను కోరారు. దీంతో సంగెం లక్ష్మీబాయి 1938 నుంచి 1946 వరకూ ఎనిమిదేండ్లు జీతం భత్యం తీసుకోకుండా గౌరవ వార్డెన్గా ఉన్నారు.