ఝరాసంగం, జూలై 27 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం శ్రావణమాస విశేష పూజలకు సిద్ధమైంది. జిల్లాలోనే ఈ ఆలయం అతి పెద్దది. శ్రావణమాసం ప్రారంభం నుంచి చివరి వరకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు నిత్యం భారీ సంఖ్యలో వచ్చి పార్వతీ సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక వాహనాలు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ఆలయానికి భక్తులు చేరుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి 116 కిలో మీటర్ల దూరంలో మండల కేంద్రమైన ఝరాసంగంలో కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం ఉంది. జాతీయ రహదారి-65కి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది.కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలోని అమృత గుండంలో స్నానాలు ఆచరిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
భారీ ఏర్పాట్లు
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శ్రీనివాసమూర్తితో పాటు ఆలయ సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు ఈనెల 29న ప్రారంభమై ఆగస్టు 27వరకు కొనసాగుతాయి. ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు దర్శనం నిమిత్తం వస్తారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తాగునీరు, స్నానపు గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, భక్తులు బారులు తీరేందుకు బారికేడ్లు, వైద్యం, విద్యుత్తు సదుపాయాలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు సరిపడా లడ్లు, పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. జహీరాబాద్ నుంచి ఝరాసంగం వరకు ప్రతి ముప్పై నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నారు.
-శ్రీనివాసమూర్తి,కేతకీ ఆలయ ఈవో
కేతకీలో శ్రావణమాసం విశిష్ట పూజలు
స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రాత్రికి సేవ భజనలు చేస్తారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన. పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం,రుత్విక్కరణ, పల్లకీసేవ, భజనలు నిర్వహిస్తారు. స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రస్వాహకార, నవగ్రహ శాంతి హోమం. భక్తులతో అమృత గుండంలోని జలలింగానికి ప్రత్యేక పూజలు చేస్తారు. నిత్యం భక్తులకు అన్నదానం చేస్తారు. ఉత్సవాల ముగింపు రోజు స్వామివారికి కుంకుమార్చన, రాత్రికి పల్లకీసేవ, భజనలు, భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు.