గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనం
క్రీడా ప్రాంగణాలు యువతకు ఎంతో మేలు
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
వట్పల్లి, జూన్ 4: పల్లెప్రగతిలో నిర్దేశిత లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కోరారు. వట్పల్లి మండలంలోని నాగులపల్లి, సాయిపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయాలన్నారు. పల్లె ప్రగతిలో పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. నాగులపల్లిలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, మన ఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులు, తెలంగాణ క్రీడా ప్రాంగణం పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. గ్రామాల్లో పల్లె పకృతి వనం, సర్సరీలో మొక్కల ఎదుగుదల బాగుందని నాగులపల్లి, సాయిపేట సర్పంచ్లు, కార్యదర్శులను అభినందించారు. ప్రజాప్రతినిధులను ప్రేరేపిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన ఎంపీవో యూసుఫ్ను అభినందించి, శాలువా కప్పి సన్మానించారు. ప్రతి గ్రామంలో సర్పంచులు, అధికారులు ఇదే స్ఫూర్తితో పనిచేసి గ్రామాలను అభివృద్ధి పథంలో కొనసాగించాలని సూచించారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి గీత, ఎంపీడీవో జగదీశ్వర్, కార్యదర్శులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.
పల్లెలు, పట్టణాలు మెరిసిపోవాలి
పుల్కల్/చౌటకూర్ జూన్4: ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు మెరిసిపోవాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని గొంగ్లూర్లో పల్లె ప్రకృతి వనం, ఉమ్మడి మండలంలోని గంగోజిపేటలోని డంపింగ్యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసర ప్రాంతాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, డంపింగ్యార్డుల్లో కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం గొంగ్లూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని బాగా చూసుకుంటున్న తోటమాలి ఎవరని అడిగి తెలుసుకుని, అతడికి శాలువా కప్పి సత్కరించారు. మొక్కలను ఎప్పటికీ ఇదేవిధంగా ఉండేలా చూసుకోవాలని ప్రశంసించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో మధులత తదితరులు ఉన్నారు.