15 నిమిషాల్లోనే బడ్జెట్ను ఆమోదించిన పాలకవర్గం సభ్యులు
హాజరైన మున్సిపల్ చైర్పర్సన్, అదనపు కలెక్టర్
బొల్లారం, మార్చి 26 : బొల్లారం మున్సిపాలిటీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.16.54కోట్లతో బడ్జె ట్ అంచనాలు రూపొందించారు. మున్సిపల్ సమావేశ మందిరంలో శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బల్దియాకు రూ.16.54కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. రూ.16.53 కోట్ల వ్యయం, రూ.లక్ష మిగులు ఉంటుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్లో రూ.22.65కోట్ల అంచనాతో మున్సిపల్ బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలోనే ముగించారు. కమిషనర్ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు ఆర్వో శ్రీధర్ బడ్జెట్ ప్రతిని చదివి వినిపించారు. ఏవైనా సందేహాలుంటే అడగాలని కమిషనర్ సభ్యులను కోరారు. బడ్జెట్పై ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయకపోవడంతో 15 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అనీల్కుమార్రెడ్డి, కౌన్సిలర్లు హన్మంత్రెడ్డి, వేణుపాల్రెడ్డి, నీహారికారెడ్డి, సుజాత, గోపాలమ్మ, సంధ్య పాల్గొన్నారు.