క్వింటాల్ ధర రూ.5,100
జహీరాబాద్ మార్కెట్ యార్డులో ప్రారంభమైన కొనుగోలు కేంద్రం
త్వరలోనే అందోల్,నారారాయణఖేడ్లో ఏర్పాటు
దళారీ వ్యవస్థకు ఇక స్వస్తి
పంట కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ
జహీరాబాద్, మార్చి 22 : యాసంగిలో రైతులు సాగు చేసిన శనగ పంట చేతికి వస్తున్నది. శనగ పంటను అమ్ము కునేందుకు అన్నదాత సిద్ధం కావడంతో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పడి మోసపోకుండ ఉండేందుకు ప్రభుత్వం కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ఫెడ్తో శనగ పంటను కొనగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. శనగ పంటకు ప్రభుత్వం మద్దతు ధర రూ.5,100 ప్రకటించింది. జహీరాబాద్ మార్కెట్లో శనగ క్వింటాల్ ధర రూ.4600 వరకు ఉంది. సర్కారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు రూ.500 ధర అధికంగా వస్తున్నది. ప్రభుత్వం శనగల కొనుగోలు కేంద్రాన్ని జహీరాబాద్లో ఏర్పాటు చేసింది. ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు పెరగడంతో శనగ పంట దిగుబడి భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జహీరాబాద్లో శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు శనగ పంట రాసులు చేసి మార్కెట్కు తరలిస్తున్న సమయంలో మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా పంటలు కొనుగోలు చేయడంతో అన్నదాతలు తీవ్రం గా నష్టపోతున్నారు. మార్కెట్లో కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు వ్యాపారులు చెప్పిన ధరకు శనగలు అమ్మకాలు చేసే వారు. జహీరాబాద్ మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్కు రూ.4,400 నుంచి రూ.4,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాల్కు రైతులు రూ.500 వరకు నష్టపోతున్నారు. త్వరలో నారాయణఖేడ్తోపాటు అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందని అధికారులు తెలిపారు.
శనగలకు మద్దతు ధర రూ.5,100..
ప్రభుత్వం శనగ రైతులకు మద్దతు ధర కల్పిచేందుకు క్విం టాల్కు రూ.5,100 ధర ఇస్తున్నది. వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రైవేట్ వ్యాపారుల దోపిడీకి ముకుతాడు పడనుంది. జహీరాబాద్ డివిజన్లో అధికంగా రైతులు యాసంగిలో శనగ సాగు చేశారు. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్ మండలంలో శనగ సాగు చేశారు. శనగలు మార్క్ఫెడ్లో అమ్మకాలు చేసేందుకు వచ్చే రైతులు గ్రామ రెవెన్యూ అధికారి, ఏఈవో సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, పట్టా పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్, ఆధార్కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.
మార్కెట్లో దళారులకు చెక్..
ప్రభుత్వం అన్నదాత పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసింది. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు యాసంగిలో శనగ పంట సాగు చేసిన రైతు ల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్ద ఆన్లైన్ జాబితాలో ఉన్న రైతుల నుంచే శనగలు కొనుగోలు చేస్తారు. కానీ వ్యవసాయ శాఖ అధికారులు చేసిన జాబితాకు గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటకు అక్కడక్కడా పొంతన లేకపోవడంతో సమస్యగా మారింది. దీంతో శనగలు అమ్మకాలు చేసేందుకు వస్తున్న రైతులకు కొనుగోలు కేంద్రం వద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారులు స్థానిక ఏఈవోల ద్వారా ధ్రువీకరించిన రైతుల శనగలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.