న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఎంతో సహకరిస్తున్నదని టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాశ్ తెలిపారు. రైల్వేశాఖ పనితీరుపై ఇవాళ రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆదాయార్జనలో దేశంలో రెండవ స్థానంలో ఉందన్నారు. ఎస్సీఆర్లో అయిదు డివిజన్లు ఉన్నాయని, దాంట్లో రెండు ఆంధ్రా, రెండు తెలంగాణ, ఒకటి నాందేడ్లో ఉన్నాయన్నారు. అయితే ఆంధ్రా జోన్లలో ఉన్న డివిజన్లకు అధిక సంఖ్యలో కేటాయింపు ఇచ్చారని ప్రకాశ్ తెలిపారు. ఆంధ్రాకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ తెలంగాణ ఏమీ ఇవ్వడం లేదన్నీరు. సికింద్రాబాద్ డివిజన్లో .. కోల్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటి నుంచి రవాణా చార్జీలు బోలెడు వస్తున్నాయన్నారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచాలన్నారు. కాజీపేట్ను డివిజన్గా ప్రకటించాలని ఎంపీ ప్రకాశ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో కొత్త కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం చెబుతోందని, ఇది తెలంగాణకు ఇచ్చిన హామీని విస్మరించడమే అని బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని తొలుత 1980లో పీవీ హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత పంజాబ్కు ఆ ఫ్యాక్టరీ వెళ్లిందన్నారు. కొన్ని ఒప్పందాల ప్రకారం కపూర్తలాలో, ఆ తర్వాత రాయ్బరేలీలో ఏర్పాటు చేశారన్నారు. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లోనూ రైల్వే మంత్రులు ఉన్న కారణంగా వారికి ఫ్యాక్టరీలు ఇచ్చారన్నారు. దక్షిణాదిలో పెరంబదూర్లో ఉన్న రైల్వే ఫ్యాకర్టీ బాగా పనిచేస్తున్నదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలోని హామీ ఇచ్చారని, దానికి అనుగుణంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు.