“సమ్మతమే’ ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ అయినా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. థియేటర్లలో సినిమా చూసి ఆనందించండి. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం హైదరాబాద్లో ‘సమ్మతమే’ చిత్ర ట్రైలర్ను ఆయన ఆవిష్కరించారు. కిరణ్ అబ్బవరం, చాందినిచౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. కంకణాల ప్రవీణ నిర్మాత. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన వారందరూ సమ్మతమే అంటారు. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరిని మెప్పిస్తుంది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘మాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని గొల్లపల్లి అనే చిన్న గ్రామం. మాలాంటి సినీ ఔత్సాహికులకు మద్దతునిస్తున్న మంత్రి కేటీఆర్గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గీతా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు. ‘కేటీఆర్గారు ట్రైలర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, మాలాంటి కొత్తవాళ్లు సినిమాల్లో రాణించాలని కేటీఆర్గారు మాట్లాడటం మాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా చూసినవారందరూ అంతా సమ్మతమే అని ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ సినిమా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నాం’ అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు.