శంషాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామనగరం లోని దివ్యసాకేతంలో స్వామివారు చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభించారు. అదేవిధంగా సుదర్శనహోమం, వడమాల సేవ జరిపారు. చినపిల్లలకు వ్యాధి నిరోధక ఆయుర్వేద ఔషధాన్ని పంపిణి చేశారు.
అనంతరం కుటీరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు మీడియాకు శ్రీశ్రీ చినజీయర్ స్వామి, మైహోం అధినేత డా. జూపల్లి రామేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ చినజీయర్ స్వామి మాట్లాడుతూ 2022 ఫిబ్రవరి 14న ఆవిష్కరణ మహోత్సవం ఉంటుందని వివరించారు. 12 రోజుల పాటు వేడుకలు జరుగుతాయని, కార్యక్రమాలు చరిత్రాత్మకమని, చరిత్రకు వన్నె తెచ్చే మహోత్సవమని వెల్లడించారు.
ఈ మహోత్సవాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకటయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడి, హోం మంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలియజేశారు. 216 అడగుల ఎత్తైన పంచలోహ భారీ విగ్రహం ప్రపంచ అద్భుతం కాగా 100 ఎకరాల విస్తీర్ణంలో 1200 కోట్లతో అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం ఏర్పాటు కాబోతుందని చెప్పారు. 12 రోజుల పాటు 128 యాగశాలలో 5 వేల మంది రుత్విక్కులు 4 వేదాల పారాయణం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి, దేవనాగర జీయర్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.