ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ నుంచి తాజా అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభాస్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆయన మాస్ లుక్లో శక్తివంతంగా కనిపిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. ‘మాస్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో చిత్రీకరణ జరుపుతున్నాం. యాభై శాతం షూటింగ్ పూర్తయింది. వీఎఫ్ఎక్స్ వర్క్ను విదేశాల్లో చేస్తున్నాం. మునుపెన్నడూ చూడని రీతిలో ప్రభాస్ పాత్రను తీర్చిదిద్దాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.