అమరావతి : బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో గురువారం శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసం సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నది. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారిని ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అలంకరించారు. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు పూజలు నిర్వహించారు.
ఉత్సవాల చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు. దేవస్థానం ఈఓ, భ్రమరాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సోమినాయుడు మొదట ప్రత్యేక పూజలు చేశారు. శాకాంబరీగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అయితే, కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో మాస్క్లు ధరించిన, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసిన అనంతరమే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.