దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. స్నేహితురాళ్లతో వెళ్దామన్నా.. ఏవేవో ఆటంకాలు. భద్రతపై అనుమానాలు. ఇప్పుడు మహిళలు స్వేచ్ఛగా వాళ్లు కోరుకున్న చోటికి వెళ్లిపోవచ్చు. ‘అప్పుప్పంతాడి’ మహిళల విహార సంస్థతో ఇది సాధ్యమవుతున్నది.
కేరళకు చెందిన సజ్నా అలీకి చిన్నప్పటి నుంచి విహారయాత్రలంటే ఇష్టం. 2014లో తన స్నేహితురాళ్లతో కలిసి తిరువనంతపురం నుంచి ఒడిశాకు వారాంతపు విహారానికి వెళ్లింది. అది కాస్తా విజయవంతం కావడంతో, మహిళా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ప్రారంభించాలని అనుకుంది. ‘అప్పుప్పంతాడి’ పేరుతో ట్రావెల్ ఏజెన్సీ మొదలుపెట్టింది. ‘అప్పుప్పంతాడి’ అంటే మలయాళంలో తాతయ్య అని అర్థం. మహిళా యాత్రికులకు తాము తాతయ్య దగ్గర భద్రంగా ఉన్నామన్న అనుభూతి కలిగించే ఉద్దేశంతో ఆ పేరు పెట్టానని చెబుతుంది సజ్నా. ఈ సంస్థ మహిళలకు మాత్రమే విహార ఏర్పాట్లుచేస్తుంది. ప్రయాణం, బస, భోజన వసతి అన్నీ సంస్థే చూసుకుంటుంది.
భద్రతాపరమైన లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అవసరమైతే గైడ్నూ తోడుగా పంపుతుంది. ఎనిమిదేండ్ల కిందట మొదలైన ఈ సంస్థ ఇటీవలే విజయవంతంగా 400వ విహారాన్ని పూర్తిచేసింది. ‘అప్పుప్పంతాడి’ ద్వారా ఇప్పటివరకు సుమారు 4,300 మంది మహిళలు తాము కోరుకున్న ప్రదేశాలను చుట్టివచ్చారు. తాజాగా అంతర్జాతీయ
యాత్రలనూ నిర్వహిస్తున్నది ఈ సంస్థ.
‘అప్పుప్పంతాడి’ ఫేస్బుక్ పేజీని 11వేలమంది ఫాలో అవుతున్నారు. 22 వాట్సాప్ గ్రూప్లకు అడ్మిన్గా విహార విశేషాలను షేర్ చేస్తుంటుంది సజ్నా. మహిళలూ.. మీరూ ఏదైనా విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ‘అప్పుప్పంతాడి’ని సంప్రదిస్తే సరి!