నారాయణ సంస్థతోనే లీకుల వ్యవహారం ప్రారంభమైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రికార్డుల కోసం తప్పుడు విధానాలను అవలంబించారని, కాపీయింగ్ అనే పనిని వ్యవస్థాగత నేరంగా నారాయణ మార్చేశారని సజ్జల మండిపడ్డారు.
టెన్త్ పేపర్ లీకేజీలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అయితే ఈ లీకేజీలు, మాస్ కాపీయింగ్ విషయంలో జగన్ సర్కార్ గట్టిగా వ్యవహరించడం వల్లే ఇవన్నీ బయటపడ్డాయని, విద్యా వ్యవస్థకు కొందరు చీడలా తయారయ్యారని సజ్జల ఫైర్ అయ్యారు.
చట్టం అందరికీ సమానమే అన్న సూత్రాన్ని ఏపీ సీఎం జగన్ పాటిస్తారని, నారాయణ అరెస్ట్ విషయంలో కొందరు నానా హైరానా చేసి, తమపై బురద జల్లాలని చూస్తే, అది వారికే రివర్స్ అయ్యిందని సజ్జల కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారాన్ని తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని పేర్కొన్నారు. అయితే టీడీపీ చేస్తున్న విమర్శలను తాము ముందుగానే ఊహించామని అన్నారు.
మాస్ కాపీయింగ్, లీకుల వ్యవహారంలో కొందరు ఎక్స్పర్ట్స్ అంటూ పరోక్షంగా మాజీ మంత్రి నారాయణపై మండిపడ్డారు. ఓ యాంత్రికమైన చదువును సమాజంపై రుద్ది, ఆ విధానంలో వేల కోట్ల రూపాయలను నారాయణ ఆర్జించారని ఆరోపించారు. వాళ్ల దగ్గరి నుంచే ఈ మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీలు వచ్చాయని ఫైర్ అయ్యారు. తమ దృష్టిలో అందరూ సమానులేనని, వైఎస్ కొండారెడ్డి తప్పు చేశారని తేలడంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేశామని సజ్జల స్పష్టం చేశారు.