శ్రీశైలం : మహిమాన్విత క్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి వేదపండితులచే మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకీ సేవ నిర్వహించారు.
ఆలయంలో భక్తుల సందడి
క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్నాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు సుమారు ఇరవైవేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్యూలైన్ల వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు పరీక్షిస్తున్నారు. మాస్క్లు ధరించిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తున్నట్ల అధికారులు చెప్పారు.
విరాళాల వెల్లువ
దేవస్థానానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి దాతలు ముందుకు రావడంపై ఈఓ లవన్న హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన జయంత్రెడ్డి కుటుంబీకులు రూ.5లక్షలు కుటీర నిర్మాణ పథకానికి విరాళం అందజేశారు. గోసంరక్షణ నిధికి నిజాంపేటకు చెందిన కే రవికుమార్ అన్నపూర్ణ దంపతులు రూ.లక్ష, ఎం సతీశ్కుమార్ దంపతులు గో సంరక్షణ నిధికి రూ.లక్ష, అన్నదాన పథకానికి రంగారెడ్డి జిల్లా గండిపేట మంచిర్యాలకు చెందిన బీ కిరణ్ కుమార్ దంపతులు రూ.లక్ష, కర్నూలుకు చెందిన సుబ్బారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి రూ.లక్ష విరాళాలు అందజేశారు. ఆలయ ఈఓను కలిసి చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా వారికి స్వామి అమ్మవార్ల దర్శనాలు చేయించి.. శేషవస్ర్తాలు, ప్రసాదాలు, జ్ఞాపిక అందించి సత్కరించారు.