Save Soil | భూమిని కాపాడుకోకపోతే.. మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉందని ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. ఈ ముప్పును ముందే అడ్డుకునే ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 90 శాతం భూమి 2050 నాటికి నిస్సారంగా మారిపోయే ముప్పు ఉంది. నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉంది. భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా.. ఆహార సంక్షోభం, నీటి సంక్షోభం ఏర్పడవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. భయానక కరువు కాటకాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మానవాళి మనుగడకే ముప్పు అని వాసుదేవ్ పేర్కొన్నారు.
పుడమి రక్షణ కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా 100 రోజుల బైక్ యాత్రను ఇషా ఫౌండేషన్ నేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన సంగతి తెలిసిందే. లండన్లోని ట్రాఫల్గర్ స్క్వేర్ నుంచి ఆయన బైక్ జర్నీ ప్రారంభమైంది. 27 దేశాల మీదుగా 30 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా నాణ్యతను కోల్పోయి భూసారం నిస్సారంగా, ఎడారిగా మారకుండా కాపాడుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ సేవ్ పిలుపునిచ్చారు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మట్టిని రక్షించు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గీ వాసుదేవ్ హాజరై ప్రసంగించారు. ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని తెలిపారు. సారవంతమైన భూమిలో కనీసం 3 నుంచి 6 శాతం సేంద్రియ పదార్థం ఉండాలి. కానీ.. భారత్లోని భూముల్లో సుమారు 0.65 శాతం మాత్రమే సేంద్రియ పదార్థం ఉందని చెప్పారు. మట్టిని కాపాడటం గురించి మన పిల్లలకు చెప్పడంకంటే ముందు.. మనం ఆచరించి చూపాలని సూచించారు. పర్యావరణంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ.. భూమిని కాపాడుకోవడం ప్రస్తుతం మన ముందు ఉన్న అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. భూమిని ఇప్పుడు కాపడుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గత 30 ఏండ్లుగా భూమిని కాపాడుకోవడంపై తాను ఉద్యమిస్తున్నానని వాసుదేవ్ గుర్తు చేశారు. కానీ ఈ అంశంపై ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. భూమి ఎడారి అవుతుందని అందరికీ తెలుసు.. దానికి పరిష్కారం కూడా మన దగ్గరే ఉంది.. కానీ ఎవరు పాటించడం లేదన్నారు. జనవరిలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ జరిగినా… భూమిని కాపడుకోవాల్సిన అవసరంపై ఎవరు చర్చించలేదని గుర్తు చేశారు. భూమిని కాపాడుకునేందుకు వేసవిలోనూ భూమిని కప్పి ఉంచే పంటలు సాగు చేయాలి. భూమిని కాపాడుకోకపోతే.. భవిష్యత్తులో 3 మిలియన్ల ప్రజలు మృతి చెందే ప్రమాదం ఉంది. భూమిని కాపాడుకునేందుకు వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వాసుదేవ్ నొక్కి చెప్పారు.