చండీగఢ్ : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు సోమవారం పంజాబ్ అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. వ్యవసాయ చట్టాల తొలగింపుతో పాటు మండుతున్న ధరలకు వ్యతిరేకంగా వారు ఆందోళన నిర్వహించారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బడ్జెట్లో వీటిని పొందుపరచాలని శిరోమణి అకాలీదళ్ సభ్యులు నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రసంగానికి అడ్డుతగిలి సభలో తీవ్ర గందరగోళం చెలరేగేలా వ్యవహరించినందుకు శుక్రవారం శిరోమణి అకాలీదళ్ సభ్యులందరినీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు. ఇక పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్ధానాలన్నింటినీ చాలా వరకూ నెరవేర్చామని సీఎం అమరీందర్ సింగ్ చేసిన ప్రకటనను విపక్ష సభ్యులు వ్యతిరేకించారు.