జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు రేపిన చిచ్చు ఇప్పుడే చల్లారేలా లేదు. నమ్మకస్తుడైన అశోక్ గెహ్లాట్కు పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి, సచిన్ పైలట్ను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అయితే, ఉన్నట్టుండి సీఎం అశోక్ గెహ్లాట్ వ్యవహరించిన తీరుతో అధిష్ఠానం కంగుతిన్నది.
సచిన్ పైలట్కు సీఎం పదవి ఇవ్వాలన్న హైకమాండ్ నిర్ణయంపై గెహ్లాట్ వర్గీయులైన 90 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. సమస్య పరిష్కారం కోసం అధిష్ఠానం ప్రతినిధులను పంపినా రెబల్ ఎమ్మెల్యేలు చర్చకు రాలేదు. నచ్చజెప్పమని గెహ్లాట్కు చెప్పినా అందులో తన ప్రమేయం ఏమీ లేదని, క్షమించాలని చెప్పి తప్పించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకుంటే అశోక్ గెహ్లాట్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సచిన్ పైలట్ పార్టీ హైకమాండ్తో అన్నట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై స్పందించిన సచిన్ పైలట్.. అదంతా ఉత్త పుకారేనని కొట్టిపారేశారు. ఆ తప్పుడు వార్త తనను భయపెట్టిందని చెప్పారు. తాను కాంగ్రెస్ హైకమాండ్తోగానీ, సీఎం అశోక్ గెహ్లాట్తోగానీ ఏమీ మాట్లాడలేదని తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. 19న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటివరకు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.