న్యూఢిల్లీ : రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో.. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ భేటీ అయ్యారు. అంతకు ముందే మధ్యాహ్నం పార్టీ అధినేత్రితో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.
జరుగుతున్న పరిణామాలపై సోనియాకు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే, ఒకవేళ రాజీనామా చేయాలని సోనియాగాంధీ కోరితే.. చేస్తానన్నారు. మరో వైపు, రాజస్థాన్ సీఎం విషయంలో పార్టీ అధినేత్రిదే తుది నిర్ణయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సచిన్ పైలట్ పార్టీ అధ్యక్షురాలితో భేటీకావడం చర్చనీయాంశంగా మారింది.
అయితే, అశోక్ గెహ్లాట్కు పార్టీ పగ్గాలు అప్పగించి.. సచిన్ పైలట్కు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని భావించగా.. గెహ్లాట్ మద్దతుదారులు తిరుగుబావుటా ఎగురవేసి రాజీనామాలకు దిగిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో సచిన్ పైలట్ను సీఎం అభ్యర్థిగా అంగీకరించలేదని, అవసరమైతే మధ్యంతర ఎన్నికలకు సైతం సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం రాజస్థాన్ సీఎం బాధ్యతలను తిరిగి అశోక్ గెహ్లాట్కే అప్పగిస్తుందా? సచిన్ పైలట్కు ఇస్తుందా? అన్న చర్చ సాగుతున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముందు రాజస్థాన్లో సంక్షోభం సవాల్గా మారడంతో.. దీనికి ముగింపు పలికేందుకు పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగియనున్నది. పార్టీ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ల మధ్య పోటీ జరుగనున్నట్లు తెలుస్తున్నది.