హైదరాబాద్ : అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు అందేలా చూస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై మంత్రి హైదరాబాద్లోని అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 4 ఏకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3,946 కోట్ల రూపాయలు విడుదల చేశామని మంత్రి తెలిపారు.
అలాగే 78 లక్షల 93 వేల 413 ఎకరాలకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు మంత్రి వివరాలను వెల్లడించారు. ఐదు ఎకరాల పైబడి ఉన్న రైతులకు రేపటి నుంచి రైతుబంధు నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. సమీక్షలో రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీ ఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.