న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్నది. నిత్యం రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై బాంబులతో విరుచుకుపడుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పలువురు ప్రజలు దేశాన్ని వీడి వెళ్లిపోతున్నారు. మరికొందరు స్థానికంగా ఉన్నా యుద్ధం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే మరి మూగజీవాల పరిస్థితేంటో తెలిసిపోతుంది. కొందరు తమ పెంపుడు జంతువులను వదిలేయడంతో ఆకలికి విలవిలలాడిపోతున్నాయి. ఈ క్రమంలో మూగజీవాల ఆత్మబంధువుగా ఉక్రెయిన్లోకి వచ్చాడో యువకుడు.
పోలాండ్కు చెందిన జాకుబ్ కొటోవిక్స్ (32) అనే యువకుడు ఎల్వివ్ నగరంలో గత 15 రోజుల్లో 200 పిలులు, 60 కుక్కల ప్రాణాలతో పాటు మేకపిల్లను సైతం కాపాడాడు. వాటిని దత్తత తీసుకోవాలని భావిస్తున్నాడు. మూగజీవాలను రక్షించేందుకు రూ.12లక్షలకు రెండు కార్లను అద్దెకు తీసుకున్నాడు. జాకుబ్ కొటోవిక్స్ ఏడీఏ ఫౌండేషన్లో పశువైద్యుడిగా పని చేస్తున్నారు. జాకబ్కు సంస్థ పని చేస్తూనే.. ప్రైవేటు వెటర్నరీ ఆసుపత్రిని సైతం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతానికి, జాకుబ్ మూగజీవాలను కాపాడేందుకు గిల్డ్ఫోర్డ్ను విడిచిపెట్టి పోలాండ్లో కొంతకాలం ఉండాలని నిశ్చయించుకున్నాడు.