మాస్కో, సెప్టెంబర్ 27: ఉక్రెయిన్పై యుద్ధంలో పోరాడేందుకు అదనంగా సమీకరించనున్న 3 లక్షల మంది జవాన్లలో రైతులు కూడా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంటల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని సంకేతాలిచ్చారు. వ్యవసాయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆ ప్రాంతాల విలీనంపై 30న ప్రకటన
ఉక్రెయిన్పై సైనికచర్య కొనసాగిస్తున్న రష్యా.. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను రష్యాలో విలీనంపై సెప్టెంబర్ 30న అధికారికంగా ప్రకటించే అవకాశముందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో రష్యా చేపట్టిన రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) మంగళవారం (సెప్టెంబర్ 27)తో ముగుస్తున్నదని తెలిపింది.