మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల జపొరిజియా అణు కేంద్రం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్లాంట్ వద్ద ఉక్రెయిన్ ఉద్యోగులు ఉన్నా.. ఆ కేంద్రాన్ని మాత్రం రష్యా సైనికులు పహారా కాస్తున్నారు. అయితే జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించేది లేదని రష్యా స్పష్టం చేసింది. ఒకవేళ మిలటరీని అక్కడ నుంచి తప్పిస్తే అప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని రష్యా అధికారి ఒకరు తెలిపారు. యూరోప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన జపొరిజియా సేఫ్టీపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అక్కడ కాల్పుల ఘటనలు పెరగడంతో.. ఆ ప్లాంట్ నుంచి ఏక్షణమైనా భారీ స్థాయిలో అణు లీకేజీ జరగనున్నట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యా ఆరంభంలో జపొరిజియా ప్లాంట్ను స్వాధీనం చేసుకున్నది.
అయితే ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, టర్కీ నేత రీకాప్ తయిప్ ఎర్డగోన్ను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ కలిశారు. జపొరిజియాకు ఎటువంటి ప్రమాదం జరిగినా అది సూసైడ్ అవుతుందని గుటెర్రెస్ వార్నింగ్ ఇచ్చారు. మరో చెర్నోబిల్ జరుగుతుందేమో అన్న భయాందోళనలను టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్ వ్యక్తం చేశారు. రష్యా కావాలనే పవర్ ప్లాంట్ వద్ద కాల్పులు జరుపుతున్నట్లు జెలెన్స్కీ ఆరోపించారు. జపొరిజియా నుంచి మిలటరీని తప్పించాలని ఉక్రెయిన్ చేసిన వాదనను రష్యా సమాచారశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇవాన్ చెచయేవ్ ఖండించారు.