న్యూఢిల్లీ: తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు స్థానిక చట్టాలను అమలు చేయాల్సిందేనని మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్కు పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. కంపెనీ పాలసీల కంటే స్థానిక చట్టాలు పాటించడమే శిరోధార్యం అని ఉద్ఘాటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్షతన శుక్రవారం పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరిగింది.
నూతన ఐటీ నిబంధనల అమలుపై కేంద్రానికి, ట్విటర్కు మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, ఈ సమావేశానికి హాజరైన ట్విట్టర్ ప్రతినిధులు అస్పష్ట సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది.
దేశీయ చట్టాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని స్థాయీ సంఘం ట్విట్టర్ను గట్టిగా ప్రశ్నించినట్లు వినికిడి. కొద్ది రోజులుగా కేంద్రానికి, ట్విటర్కు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
గడువులోగా కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్ పాటించకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు టూల్కిట్ వ్యవహారం, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖల ఖాతాలకు బ్లూ టిక్ తొలగింపు అంశాలు ఈ దూరాన్ని మరింతగా పెంచిన సంగతి తెలిసిందే.