ఒక సామ్రాజ్యం కూలినప్పుడు కొత్త రాజ్యాలు పుడుతాయి. కర్ణాటకలోని కళ్యాణి కేంద్రంగా ఉన్న కళ్యాణి చాళుక్యుల పత నం సరిగ్గా ఇలాంటి చారిత్రక సందర్భాన్ని సృష్టించింది. దక్కనులో 3 కొత్త రాజ్యాలు మొదలయ్యాయి. అందులో ఒకటి తెలంగాణ ప్రాంతంలో ఎదుగుతూ, ఆంధ్ర తీరం వరకు విస్తరించి సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయు లు. మిగిలిన రెండూ.. ఒకటి మ హారాష్ట్రలోని దేవగిరి రాజధానిగా ఎదిగిన యా దవ రాజ్యం, రెండవది కర్ణాటకలోని ద్వార సముద్రం కేంద్రంగా పెరిగిన హొయసల రాజ్యం.
రుద్రదేవుడి రణనీతి: రుద్రదేవుడు అధికారాన్ని అందుకునే నాటికి కళ్యాణి చాళుక్య రాజ్యం సంక్షోభానికి చేరుకున్నది. ఇతడి తండ్రి రెండవ ప్రోల కాలంలోనే కాకతీయ అధికార విస్తరణ మొదలైనా రుద్రదేవుడి కాలంలో కళ్యాణి చాళుక్య అధికారం నుంచి బయటపడి స్వతంత్ర రాజ్యంగా మారింది. స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యానికి పునాది వేసినవాడు రుద్రదేవుడు. అనుమకొండ ప్రాంతంలో మొదలై ఉత్తర, దక్షిణ తెలంగాణల మీదుగా కృష్ణా నదినీ, పల్నాడును దాటి సాగరతీరం చేరుకునే వ్యూహంతో యుద్ధనీతిని ప్రదర్శించినవాడు రుద్రదేవుడు.
అనుమకొండ లేదా ఓరుగల్లు నుంచి సముద్ర తీరానికి ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థం చేసుకుంటే రుద్రదేవుడి విస్తరణలో ఒక పద్ధతీ, సునిశిత రాజకీయ నైపుణ్యం కనిపిస్తాయి. కాకతీయ రాజ్యం ఆర్థికంగా నిలదొక్కు కోవాలంటే సముద్ర మార్గాల గుండా జరిగే వర్తకం కీలకం. దానికి కోస్తా ప్రాంతాలు అధీనంలో ఉండాల్సిన అవసరం ఉన్నది. వేంగీ చాళుక్య పతనం తర్వాత ఆంధ్రలోని తూర్పు తీరం రాజకీయంగా బలమైన రాజ్యం కింద లేదు. అందుకే రుద్రదేవుడు రాజ్య విస్తరణకు తూర్పు తీరాన్ని ఎంచుకున్నాడు.
అంచెలంచెల విస్తరణ: రుద్రదేవుడి విజయాలను, విస్తరణను విపులంగా తెలిపేది వెయ్యిస్తంభాల గుడి శాసనం. తొలుత అనుమకొండకు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను ఆ తర్వాత దక్షిణంగా వచ్చి కృష్ణా పరీవాహక ప్రాంతంలోని కందూరు చోళులను ఓడించడంతో మొత్తం తెలంగాణ రుద్రదేవుడి అధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి ఏపీలోని ప్రాంతాలను గెలుచుకున్నాడు. క్రీ.శ.1158 నుంచి అధికారంలోకి వచ్చిన రుద్రదేవుడు, అంతకుముందే తండ్రి రెండవ ప్రోలతో పాటు ఎన్నో విజయాలను సాధించాడు. సబ్బినాడు రాజధాని నగునూరు పాలకుడు దొమ్మరాజును ఓడించాడు.
రుద్ర దేవుడి మూడో ముఖ్యమైన విజయం కళ్యాణిలో అధికారానికి వచ్చిన కాలాచూరి బిజ్జల కుమారుడు మైళగిని కల్యాణ కటకం (కటకం అంటే సైనిక శిబిరం) వరకు తరుముకుంటూ వెళ్లడం. కర్ణాటకలోని లకే్ష్మశ్వర్ శాసనం దీని గురించి చెప్తున్నది. దీంతో అనుమకొండ నుంచి కళ్యాణివరకు, కళ్యాణి చాళుక్యుల పాలన ఉన్న మార్గం మొత్తం రుద్ర దేవుడు గెల్చుకున్నాడని అర్థమవుతుంది. ఇక దక్షిణానికి విస్తరించే క్రమంలో కందూరి చోడరాజు భీమచోడుని ఓడించి, చోడుల నగరమైన వర్ధమానపురాన్ని తగులబెట్టి కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడం. రుద్రదేవుడి శత్రువును పూర్తిస్థాయిలో ధ్వంసం చేసేవాడు.
వెయ్యి స్తంభాల గుడి: రుద్రదేవుడు క్రీ.శ.1163లో నిర్మించిన రుద్రేశ్వరాలయం (వెయ్యి స్తంభాల గుడి) కాకతీయ వాస్తు శిల్ప శైలికి సజీవ ఉదాహరణ. ఇక్కడ రుద్రేశ్వర, వాసుదేవర, సూర్యదేవరలకు గుడి కట్టించిన రుద్రదేవుడు ఒక శాసనాన్ని కూడా జారీ చేసిండు. మధ్యలో ఉన్న చతురస్రాకారపు మండపానికి తూర్పు, పడమర, ఉత్తరదిక్కులలో మూడు ఆలయాలున్నాయి.
ద్వారాలు, ముఖమండపంలోని స్తంభా లు, శివలింగం ఉన్న పానవట్టం, నంది శిల్ప క ళకు, నునుపు చేసిన నైపుణ్యానికీ తార్కాణంగా నిలుస్తాయి. ప్రస్తుతం దక్షిణ దిశలో ఉన్న మండపంలో 300 స్తంభాలున్నాయి. త్రికూటాలయంలో చాలాభాగం, మండపాలు శిథిలమై మిగిలిన స్తంభాలు కూలిపోయి ఉంటా యి. వేయి స్తంభాల గుడి నేటికీ దసరా వేడుకల్లో బతుకమ్మ ఆటతో తెలంగాణ సాంస్కృతిక వైభవానికి సాక్షిగా కొనసాగుతున్నది.
– డాక్టర్ ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000