ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికుల అండ
టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్రెడ్డి
నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్తోనే ఆర్టీసీ మనుగడ సాధ్యమనే నమ్మకం సంస్థ ఉద్యోగుల్లో ఉందని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి అందించే నివేదికలు సక్రమంగా లేవని, అందుకే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సమ్మె తరువాత ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల చెల్లింపులను ప్రభుత్వం చేసిందని, దాంతో చాలా మందికి ఉద్యోగ భద్రతపై నమ్మకం కలిగిందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం తగ్గించేందుకు కృషి చేస్తానని థామస్రెడ్డి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జే కైలాసం, నూతకంటి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఐకేపీ ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతిస్తూ తీర్మానించిన ప్రతిని ఆ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ గడ్డి అశోక్.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు అందజేశారు.