హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల అమలు కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేయడంపై కార్మికులు, ఉద్యోగుల పక్షాన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమయంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అక్కడే ఉన్నారు.
అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పురపాలకశాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ సీఎం సహకారంతోనే ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సులు, బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు. త్వరలో పీఆర్సీ అమలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలపై కూడా నిర్ణయం తీసుకొంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో తెలంగాణ ఆర్టీసీ ప్రగతి దిశగా పయనిస్తున్నదని, బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించడంతో సంస్థ నష్టాల నుంచి గట్టెక్కుతున్నదన్నారు.