యాదాద్రి భువనగిరి : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఆకస్మాత్తుగా ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సు వేగాన్ని నియంత్రించడంతో ఘోర ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద మోత్కూరు ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. బస్సు హైదరాబాద్ నుంచి తొర్రూరు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.