హరిద్వార్ : ప్రకృతితో మమేకమైన భారతీయ జీవన విధానం, విద్య, వైద్య, వైజ్ఞానిక విషయాల్లో మన పూర్వీకుల జ్ఞాన సముపార్జన, దానిని ఒక తరం నుంచి ఒక తరానికి అందించిన వైనాన్ని నేటి యువతకు వివరించి వారిని కార్యోన్ముఖుల్ని చేసే లక్ష్యంతో నిర్వహించిన కుంభ సందేశ్ యాత్ర పూర్తి అయింది. ఈ సందర్భంగా నిర్వాహకులు హరిద్వార్ డిక్లరేషన్ ముసాయిదా (డ్రాఫ్ట్)ను రూపొందించారు. ఈ సందర్భంగా కుంభ సందేశ్ యాత్ర స్ఫూర్తిని ఆరెస్సెస్ ఛీఫ్ ప్రశంసించారు. యాత్ర నిర్వాహక సంస్థ మిషన్ 5151 కార్యదర్శి అరిగె మధుసూదన్ ఈ డ్రాఫ్ట్ తొలి ప్రతిని ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్కు అందజేశారు. హరిద్వార్లో కుంభ సందేశ్ యాత్ర నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను మోహన్ భగవత్ సందర్శించారు.
మిషన్ 5151 ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మంకెన శ్రీనివాస్ రెడ్డి 41 రోజుల పాటు 10 రాష్ట్రాల గుండా 7,250 కిలోమీటర్ల పాటు సాగిన కుంభ సందేశ్ యాత్ర విశేషాలను మోహన్ భగవత్కు వివరించారు. దివ్యప్రేమ సమాజ్ ప్రెసిడెంట్ ఆశిష్ గౌతమ్, సెక్రటరీ సంజయ్ చతుర్వేది, నేషనల్ స్పోక్స్పర్సన్ అవినాష్ రాయ్, ఐఎస్ఆర్ఎన్ సీఈవో సంతోష్ గుప్తా, జీకాట్ సీఈవో శ్రవణ్ కుమార్, నాయుడు ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతం చేసింది. కొవిడ్కు చికిత్స ఏమిటని ప్రపంచమంతా అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా మన సాంప్రదాయ వైద్యవిద్యలైన ఆయుర్వేదం వంటివి ప్రజలను కరోనా నుంచి చాలావరకు కాపాడాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా అంతర్జాతీయ ప్రత్యామ్నాయ వైద్య కేంద్రాన్ని (ఇంటర్నేషనల్ ఆల్టర్నేటివ్ మెడికల్ సెంటర్)ను భారతదేశంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
భారతదేశాన్ని తిరిగి విశ్వగురుగా మార్చాలన్నది కుంభ సందేశ్ యాత్ర ప్రధాన ఆకాంక్ష. కుంభమేళా ఒకప్పుడు విజ్ఞాన మార్పిడికి, దేశీయ ప్రణాళికా వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉండేది. ఆ స్ఫూర్తిని, ఆలోచనా విధానాన్ని నేటి తరానికి తెలియజెప్పే లక్ష్యంతో యాత్ర చేపట్టారు. మన పాత వర్ణమాలలోని 108 అక్షరాలను మళ్లీ ప్రవేశపెట్టాలని, అష్టాంగ యోగ, పాణినీ వ్యాకరణ సూత్రాలను వెలుగులోకి తేవాలని జీకాట్ ప్రతిపాదిస్తోంది.